sad news: మామకు అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తూ గుండెపోటుతో అల్లుడి మృతి

  • ఒక్కరోజు వ్యవధిలో విషాదం
  • ఆసుపత్రికి రారలించినా దక్కని ప్రాణాలు 
  • కృష్ణా జిల్లా జి.కొండూరులో ఘటన

ఒక రోజు వ్యవధిలో రెండు కుటుంబాలను తీవ్ర విషాదం చుట్టుముట్టేసింది. మామ అంత్యక్రియలు ఏర్పాట్లు చేస్తున్న అల్లుడు గుండెపోటుతో చనిపోయిన విషాద ఘటన ఇది. ఒకేసారి తల్లీకూతుర్లు వితంతువులుగా మారడం రెండు కుటుంబాలకు అంతులేని ఆవేదన మిగిల్చింది.

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా జి.కొండూరుకు చెందిన కోదండరామాలయం చైర్మన్‌ పెదగమళ్ల వెంకటేశ్వరరావు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందాక ఇటీవల డిశ్చార్జి అయ్యారు. విజయవాడలోని కుమ్మరిపాలెం నాలుగు స్తంభాల సెంటర్‌కు చెందిన వీరంకి శ్రీనివాసరావు (49) ఈయన పెద్దల్లుడు. ఇతను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు.

మామ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన విషయం తెలుసుకుని చూసేందుకు జి.కొండూరు వచ్చారు. కాగా, శనివారం మామ వెంకటేశ్వరరావు చనిపోయారు. దీంతో నిన్న కుటుంబ సభ్యులతో కలిసి శ్రీనివాసరావు ఆయన అంతిమ సంస్కారం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఏర్పాట్లు చూస్తూ ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు.

ఈ హఠాత్పరిణామంతో షాక్‌కు గురైన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించినా, అప్పటికే గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో హతాశులయ్యారు. గంటల వ్యవధిలో అలా మామఅల్లుళ్లు చనిపోవడంతో కుటుంబ సభ్యులే కాదు బంధువులు, చుట్టుపక్కల వారు కూడా దిగ్భ్రమకు గురయ్యారు.

శ్రీనివాసరావుకు భార్య దుర్గాభవాని, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒకేసారి తండ్రి, భర్తను కోల్పోయి కన్నీటి పర్యంతమవుతున్న దుర్గాభవానిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు.

More Telugu News