Hayat Nagar: హయత్ నగర్ హత్య కేసులో ఆసక్తికర విషయాలు వెల్లడించిన పోలీసులు

  • హయత్ నగర్ లో తల్లిని చంపిన కుమార్తె
  • ప్రియుడితో కలిసి గొంతునులిమి హత్య
  • కేసును ఛేదించిన రాచకొండ పోలీసులు

ఇటీవల హైదరాబాదులోని హయత్ నగర్ లో కీర్తి అనే యువతి ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయడం సంచలనం సృష్టించింది. ఈ హత్యకేసును ఛేదించిన పోలీసులు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వివరాలు వెల్లడించారు. ప్రియుడు శశికుమార్ తో కలిసి కీర్తి తన తల్లి రజితను హత్య చేసిందని తెలిపారు.

కొంతకాలం కిందట కీర్తిపై పొరుగున ఉండే బాల్ రెడ్డి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడని వెల్లడించారు. దాంతో కీర్తి గర్భవతి అయిందని, కీర్తి పరిస్థితిని ఆసరాగా చేసుకుని శశికుమార్ ఆమెను లొంగదీసుకున్నాడని వివరించారు. కీర్తి, శశికుమార్ ఇద్దరూ కలిసే రజితను గొంతు నులిమి హత్య చేశారని సీపీ తెలిపారు. పక్కా ప్రణాళికతోనే రజితను ఈ నెల 19న హత్య చేశారని, మూడు రోజుల తర్వాత మృతదేహాన్ని రామన్నపేట వద్ద రైలు పట్టాలపై పడేశారని పేర్కొన్నారు.

కీర్తి గతంలోనూ తల్లికి నిద్రమాత్రలు ఇచ్చి చంపేందుకు యత్నించిందని వెల్లడించారు. ఈ కేసులో కీర్తికి సహకరించిన ప్రియుడు శశికుమార్ ను కూడా అరెస్ట్ చేశామని చెప్పారు. అంతేకాకుండా, కీర్తిపై అత్యాచారానికి పాల్పడిన బాల్ రెడ్డిపైనా కేసు నమోదు చేశామని తెలిపారు. కాగా, హత్యానేరం తమపైకి రాకుండా ఉండేందుకు కీర్తి, శశి చాలా ప్రయత్నాలు చేశారని, నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లలో చాలా ఆధారాలున్నాయని అన్నారు. తల్లిని చంపిన తర్వాత కీర్తి పోలీస్ స్టేషన్ కు వచ్చి, తల్లి అదృశ్యమైనట్టు ఫిర్యాదు చేసిందని చెప్పారు.

More Telugu News