Vijay Sai Reddy: బోటు ప్రమాదం చంద్రబాబు హయాంలో జరిగుంటే ధర్మాడి పేరు ఎవరికీ తెలిసేది కాదు: విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు

  • గోదావరిలో బోటు మునక
  • బోటును వెలికితీసిన ధర్మాడి సత్యం బృందం
  • స్పందించిన విజయసాయిరెడ్డి

గోదావరి నదిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటును కాకినాడకు చెందిన ధర్మాడి సత్యం బృందం విజయవంతంగా వెలికితీసిన సంగతి తెలిసిందే. దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. గోదావరి నది నుంచి బోటును బయటికి తీసిన ధర్మాడి సత్యం నైపుణ్యానికి, ఆయన శ్రమకు దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయని ట్వీట్ చేశారు.

అయితే, ఇదే ప్రమాదం చంద్రబాబు హయాంలో జరిగి ఉంటే ధర్మాడి సత్యానికి పేరొచ్చేది కాదని తెలిపారు. చంద్రబాబే బోటును వెలికితీసినట్టు ప్రచారం జరిగేదని, ధర్మాడి సత్యం పేరు ఎవరికీ తెలిసేది కాదని పేర్కొన్నారు. చంద్రబాబే దగ్గరుండి డైవర్లకు మార్గదర్శనం చేసి గొలుసులు వేసి పడవను బయటికి లాగాడని కులమీడియా బాకాలు ఊదేదని విమర్శించారు.

More Telugu News