సిద్ధరామయ్యకు కర్ణాటక సీఎం యడియూరప్ప స్ట్రాంగ్ వార్నింగ్

  • వీరసావర్కర్‌కు భారతరత్న ఇస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై మండిపడిన సిద్ధరామయ్య
  • ఘాటుగా బదులిచ్చిన ముఖ్యమంత్రి
  • వైఖరి మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరిక
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యాకు ముఖ్యమంత్రి యడియూరప్ప స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వీర సావర్కర్ గురించి సిద్ధరామయ్య ఇటీవల చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ.. ఆయన గురించి ఏబీసీడీలు కూడా తెలియని వ్యక్తి అనవసరంగా నోరు పారేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అండమాన్ వెళ్లి వీరసావర్కర్ అనుభవాలను తెలుసుకోవాలని సూచించారు. గాంధీని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి భారతరత్న ఇవ్వాలనుకోవడాన్ని సిద్ధరామయ్య తప్పుబట్టారు. బీజేపీ తీరు చూస్తుంటే గాడ్సేకు కూడా భారతరత్న ఇచ్చేలా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడిన యడియూరప్ప తాజాగా ఘాటుగా బదులిచ్చారు.

 అలాగే, స్పీకర్‌ను సిద్ధరామయ్య ఏకవచనంతో సంబోధించడంపైనా యడియూరప్ప మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధించడం సరికాదని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్ధరామయ్యపై శాసనసభలో సభాహక్కుల నోటీసు ప్రవేశపెడతామని తేల్చి చెప్పారు. సిద్ధరామయ్య ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని యడియూరప్ప హితవు పలికారు. ఆయన తన వైఖరి మార్చుకోకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Go Back to Shorts
Karnataka
siddaramaiah
Yadiyurappa
veer savarkar

More Telugu News