Hyderabad: టీవీ సీరియల్స్ లో అవకాశం ఇప్పిస్తానంటూ... యువతి నుంచి డబ్బు తీసుకుని ఉపాధ్యాయుడి పరారీ!

  • యువతిని మభ్యపెట్టిన గవర్నమెంట్ టీచర్
  • రూ. 1 లక్ష తీసుకుని పరార్
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

తనకు టీవీ సీరియల్స్ తీసే దర్శకులు తెలుసునని, అవకాశాలు ఇప్పిస్తానని ఓ యువతిని మభ్యపెట్టిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఆమె నుంచి డబ్బు గుంజి పారిపోయాడు. ఈ ఘటన హైదరాబాద్ లో వెలుగు చూసింది. ఎస్సార్ నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సంగారెడ్డికి చెందిన నారాయణరాజు (44) ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, ఎస్సార్ నగర్ పరిధిలోని ఓ హాస్టల్‌ లో ఉండేవాడు.

 అతనికి సుమ అనే యువతితో పరిచయం ఏర్పడగా, ఆమె నటించాలన్న కోరికతో ఉందని గమనించాడు. తనకు ఎంతో మంది తెలుసునని నమ్మించి, అవకాశం ఇప్పిస్తానంటూ, లక్ష రూపాయలు తీసుకున్నాడు. ఆపై కనిపించకుండా పోయాడు. నారాయణరాజు కూకట్ పల్లిలో ఉంటున్నాడని తెలుసుకున్న సుమ అక్కడ వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసుకున్న పోలీసులు, దర్యాఫ్తు చేస్తున్నారు.

More Telugu News