Jagan: మీ పార్టీ డమ్మీలకు కూడా మీ వైఖరేంటో తెలియడంలేదు... మీ నోటితోనే చెప్పండి: సీఎం జగన్ పై లోకేశ్ విసుర్లు

  • అమరావతిపై జగన్ వైఖరి చెప్పాలన్న లోకేశ్
  • అమరావతి ఎడారిలా మారిపోయిందని ఆవేదన
  • రాష్ట్రానికి రాజధాని అక్కర్లేదా? అంటూ వరుస ట్వీట్లు

ఏపీ సీఎం జగన్ రాజధాని అమరావతిపై తన వైఖరేంటో చెప్పాలని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ డిమాండ్ చేశారు. "మీ కోసం రాజధాని ప్రాంతంలో రాజభవనం లాంటి ఇల్లు కట్టుకున్నారు. మరి రాష్ట్ర ప్రజలకు రాజధాని నగరం అక్కర్లేదనుకున్నారా? రాజధానిపై మీ వైఖరి ఏంటో మీ నోటితోనే చెప్పండి. కనీసం మీ పార్టీ డమ్మీలకు కూడా మీ వైఖరేంటో తెలియక రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను ఆందోళనకు గురిచేస్తున్నారు. అసలు మీ వద్ద అమరావతి నిర్మాణానికి ఏమైనా ప్రణాళికలు ఉన్నాయా? లేక రాజధానిని ఇంకెక్కడికైనా తరలిస్తున్నారా?" అంటూ లోకేశ్ నిలదీశారు.

ఏదైనా గ్రామాన్ని దుష్టశక్తి ఆవహిస్తే చెట్లు మాడిపోవడం చూసి ప్రజలు ఊరిని విడిచి వెళ్లిపోవడం కథల్లో విన్నామని, ఇప్పుడు అమరావతిలో కూడా అదే జరిగిందనిపిస్తోందని ట్వీట్ చేశారు. సరిగ్గా నాలుగేళ్ల క్రితం ఇదే రోజు అమరావతి నగరానికి శంకుస్థాపన చేస్తే ఇప్పుడక్కడ ఎడారి తప్ప ఏమీ కనిపించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

More Telugu News