Andhra Pradesh: తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం: మంత్రి పేర్ని నాని

  • ముగిసిన ఏపీ కేబినేట్ సమావేశం
  • కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు వివరించిన పేర్ని నాని
  • వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు,హోంగార్డుల జీతభత్యం రూ.710కు పెంపునకు ఆమోదం

ఏపీ కేబినేట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో కొత్త సంక్షేమ పథకాల విధివిధానాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ, కేబినెట్ తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. అందరికీ సురక్షితమైన మంచినీరు ఇచ్చేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటు, తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్పొరేషన్, పొరుగు సేవల ఉద్యోగాల కోసం ప్రత్యేక కార్పొరేషన్, సాధారణ పరిపాలన శాఖ అజమాయిషీలో పొరుగు సేవల కార్పొరేషన్, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో బోర్లు వేసేందుకు రిగ్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు.

వైఎస్సార్ చేనేత నేస్తం పేరుతో ఏటా రూ.24 వేలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, ఈ పథకానికి రూ.216 కోట్లు ఖర్చు అవుతుందని అంచనాగా ఉన్నట్టు చెప్పారు. వైఎస్సార్ చేనేత నేస్తం కింద ఒకేసారి రూ.24 వేలు సాయం చేయాలని, ఏటా డిసెంబరు 21న చేనేత కుటుంబాలకు బ్యాంకు ద్వారా ఆర్థిక సాయం అందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు కార్పొరేషన్ల ద్వారా వాహనాలు కొనేందుకు నిరుద్యోగులకు రుణాలు ఇవ్వాలని, హోంగార్డులకు ఇచ్చే రోజువారీ జీతభత్యం రూ.710కు, మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. మత్స్యకార కుటుంబాలకు ఇచ్చే ఆర్థికసాయం పెంపునకు కేబినెట్ ఆమోదం తెలిపిందని, నవంబరు 21 నుంచి అమలు చేస్తామని, ఇంకా పలు నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పారు.

More Telugu News