Tsrtc: ఆర్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాం: టీఎన్జీవో నేత కారెం రవీందర్ రెడ్డి

  • ప్రతి ఆర్టీసీ కార్మికుడిని కాపాడుకుంటాం
  • ఆర్టీసీ కార్యాచరణలో మేమూ భాగస్వాములం అవుతాం
  • రేపు తెలంగాణ సీఎస్ ని కలిసి ఆర్టీసీ సమస్యలపై చర్చిస్తాం

టీఎస్సార్టీసీ కార్మికులకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు టీఎన్జీవో అధ్యక్షుడు కారెం రవీందర్ రెడ్డి ప్రకటించారు. తమ సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ టీఎన్జీవో, టీజీవో నేతలను ఆర్టీసీ జేఏసీ నేతలు ఈరోజు కలిశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, టీఎన్జీఓల కార్యవర్గ భేటీలో ఆర్టీసీ కార్మికుల సమస్యలు చర్చించినట్టు చెప్పారు.

ఇద్దరు ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యకు పాల్పడటం తమను కలిచివేసిందని ఆయన అన్నారు. ప్రతి ఆర్టీసీ కార్మికుడిని కాపాడుకుంటామని, ఆర్టీసీ కార్యాచరణలో తామూ భాగస్వాములం అవుతామని చెప్పారు. ఆర్టీసీకి తమ పూర్తి సహకారం ఉంటుందని స్పష్టం చేశారు. రేపు తెలంగాణ సీఎస్ ని కలిసి ఆర్టీసీ సమస్యలపై నివేదిస్తామని అన్నారు. కార్మికుల సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కారమైతే సబ్బండ ఉద్యోగుల సమస్యలకూ పరిష్కారం లభిస్తుందని అన్నారు.

More Telugu News