Ashwini Choubey: ఆసుపత్రిలో కేంద్ర ఆరోగ్య మంత్రిపై 'రంగు' పడింది!

  • డెంగ్యూ నియంత్రణలో ప్రభుత్వ అలసత్వంపై ప్రజల  ఆగ్రహం
  • రోగి బంధువు మంత్రి అశ్వనీ చౌబేపై సిరా చల్లి నిరసన
  • పాట్నా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ సందర్శిస్తున్న సమయంలో ఘటన

ఇటీవల వరదల పాలై డెంగ్యూ జ్వరాల బారిన పడ్డ బీహార్ రాష్ట్రంలో రోగులను పరామర్శించడానికి వెళ్లిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వనీ చౌబేకు చేదు అనుభవం ఎదురైంది. ఈ రోజు పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్ ( పీఎంసీహెచ్)లో డెంగ్యూ పేషెంట్లను ఆయన సందర్శించారు.

అనంతరం పీఎంసీహెచ్ నుంచి బయటకు వస్తున్న సమయంలో రోగి బంధువు ఒకరు మంత్రిపై సిరా చల్లాడు. రాష్ట్రంలో వరదలపై ప్రభుత్వం నిష్క్రియాత్మకంగా వ్యవహరిస్తోందని అరిచాడు. అనంతరం అతడు అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో  ఇప్పటివరకు ఎవరిని అరెస్టు చేయలేదు.
 
బీహార్ ఆరోగ్య విభాగం ఇటీవల వెలువరించిన ప్రకటనలో సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు 900 డెంగ్యూ కేసులు పాట్నాలో నమోదయ్యాయని పేర్కొంది. భారీ వర్షాలు, వరదలు పరిస్థితిని దిగజార్చగా.. 73 మంది ప్రాణాలు కోల్పోయారు.

More Telugu News