China: చైనాను విడగొట్టాలనుకునే వారు తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు: జిన్ పింగ్ హెచ్చరిక

  • హాంకాంగ్, తైవాన్ నిరసనలపై చైనా అధ్యక్షుడి స్పందన
  • బాహ్య శక్తుల జోక్యంపై మండిపాటు
  • చైనా భూభాగాన్ని వశపరచుకోవాలనుకుంటే శరీరాలను నుజ్జునుజ్జు చేస్తాం

తమ దేశ భూభాగాన్ని వశపర్చుకోవాలని చూస్తే తీవ్ర పరిణామాలు తప్పవంటూ చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ హెచ్చరిక చేశారు. నిందితులను చైనాకు అప్పగించేందుకు తీసుకురావాలనుకున్న బిల్లును వ్యతిరేకిస్తూ హాంకాంగ్ లో ప్రజలు పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తైవాన్ లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఇతర దేశాల జోక్యంపై చైనా ఆగ్రహంతో ఉంది. నేపాల్ పర్యటనలో ఉన్న జిన్ పింగ్ వీటిపై స్పందించారు.

జిన్ పింగ్ తరఫున  చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ దేశాన్ని విడదీసేందుకు బాహ్య శక్తులు సాయం చేస్తే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని అందులో ఆయన పేర్కొన్నారు. చైనా భూభాగాన్ని వశపరచుకోవాలని చూసే వారి శరీరాలను నుజ్జునుజ్జు చేస్తామంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హాంకాంగ్, తైవాన్ లు తమ భూభాగానికి చెందినవేనన్నది చైనా వాదన. ఒకపక్క హాంకాంగ్, మరోవైపు తైవాన్‌లలో చైనా తీరుకి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తైవాన్ అధ్యక్షురాలు  సై యింగ్‌ వెన్‌.. తమ ప్రాంతాన్ని చైనాలో భాగంగా గుర్తించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. నిరసన కారులు రోడ్డు, రైలు మార్గాలపై ఆందోళనలు చేస్తూ చైనా వాణిజ్యానికి ఆటంకాలు కలిగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిన్ పింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News