lover: చనిపోతున్నానన్నా స్పందించని ప్రియురాలు.. ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు

  • హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఘటన
  • మనస్పర్థలతో విడిపోయిన ప్రేమ జంట
  • ఫోన్ చేస్తే తీయలేదని బలవన్మరణానికి పాల్పడిన యువకుడు

‘నేను చనిపోతున్నా.. చివరిసారి మాట్లాడాలని ఉంది’ అని మెసేజ్ పెట్టినా ప్రియురాలు స్పందించకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫిలింనగర్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక ఎంఆర్‌సీ కాలనీకి చెందిన అభిషేక్ షిండే (20) డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఉండే వరుసకు బంధువయ్యే అమ్మాయిని అభిషేక్‌ నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నాడు.

చిన్నపాటి మనస్పర్థల కారణంగా ఇటీవల ఇద్దరూ దూరమయ్యారు. అయితే, ప్రేమించిన యువతిని మర్చిపోలేకపోయిన అభిషేక్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చనిపోవాలని నిర్ణయించుకుని ప్రియురాలికి మెసేజ్ పెట్టాడు.

తాను చనిపోవాలనుకుంటున్నానని, చివరిసారి మాట్లాడాలని ఉందని శుక్రవారం మెసేజ్ చేసి ఆ తర్వాత ఫోన్ చేశాడు. అయినప్పటికీ ఆమె ఫోన్ ఎత్తకపోవడంతో ‘ఇక సెలవు’ అని మెసేజ్ పెట్టి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలొదిలాడు. అభిషేక్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

More Telugu News