ఆకాశమే హద్దుగా చెలరేగిన కోహ్లీ... డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డ టీమిండియా కెప్టెన్

  • దక్షిణాఫ్రికా బౌలర్లను ఊచకోత కోసిన కోహ్లీ
  • టెస్ట్ కెరీర్ లో ఏడవ డబుల్ సెంచరీ నమోదు
  • భారత్ స్కోరు: 483/4
పూణేలో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా బౌలర్లను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఊచకోత కోశాడు. బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ స్టేడియం నలువైపులా చూడముచ్చటైన షాట్లను కొడుతూ, తన టెస్ట్ కెరీర్ లో ఏడవ డబుల్ సెంచరీని నమోదు చేశాడు. మొత్తం 295 బంతులను ఎదుర్కొన్న కోహ్లీ 200 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో 28 బౌండరీలను కోహ్లీ బాదాడు. 200 పరుగులు చేసినా ఇందులో ఒక్క సిక్సర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇదే సమయంలో తన టెస్ట్ కెరీర్ లో కోహ్లీ 7వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.

 మరో ఎండ్ లో కోహ్లీకి అండగా రవీంద్ర జడేజా 29 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 483 పరుగులు. అంతకు ముందు 59 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రహానే ఔట్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా మూడు వికెట్లు తీయగా, మహరాజ్ ఒక్క వికెట్ తీశాడు.
Go Back to Shorts
Team India
South Africa
Test Match
Pune
Virat Kohli
Score

More Telugu News