China: చైనా భద్రతా సిబ్బంది అధీనంలోకి చెన్నై విమానాశ్రయం!

  • నేటి మధ్యాహ్నం ల్యాండ్ కానున్న జిన్ పింగ్ విమానం
  • ఎయిర్ పోర్టును అడుగడుగునా గాలించిన చైనా సిబ్బంది
  • ఇప్పటికే చెన్నై చేరుకున్న జిన్ పింగ్ కాన్వాయ్

చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును చైనా భద్రతా సిబ్బంది, తమ అధీనంలోకి తీసుకున్నారు. నేటి మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత్ కు రానున్న సంగతి తెలిసిందే. ఆయన రాక నేపథ్యంలో ముందుగానే చేరుకున్న చైనా దళాలు, చెన్నై విమానాశ్రయాన్ని అడుగడుగునా గాలించాయి. జిన్ పింగ్ ల్యాండ్ అయిన తరువాత, ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. చైనా భద్రతాధికారులకు సీఆర్పీఎఫ్ దళాలు తమ సహకారాన్ని అందిస్తున్నాయి.

కాగా, జిన్ పింగ్ కోసం ప్రత్యేక కాన్వాయ్ ఇప్పటికే చెన్నై చేరుకుంది. అత్యాధునిక భద్రతా ప్రమాణాలు, బాంబు దాడులను తట్టుకునే సామర్థ్యంతో కూడిన నాలుగు ప్రత్యేక వాహనాలు రాగా, జిన్ పింగ్ ఏ వాహనంలో ప్రయాణిస్తారన్నది ఎవరికీ తెలియదు. అధ్యక్షుడి ప్రత్యేక భద్రతా దళం అధికారి చివరి క్షణంలోనే ఆయన ప్రయాణించాల్సిన కారును నిర్ణయిస్తారని సమాచారం.

ఎయిర్ పోర్టు నుంచి గిండి ప్రాంతంలోని స్టార్ హోటల్ కు వెళ్లే ఆయన, తిరిగి తన కాన్వాయ్ లోనే మహాబలిపురం చేరుకుంటారు. అక్కడికి ముందుగానే చేరుకోనున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలుకుతారు.

More Telugu News