Jammu And Kashmir: వారి నిర్బంధమే చట్ట విరుద్ధం.. మళ్లీ సంతకాలు కూడానా: మెహబూబా ముఫ్తీ ఫైర్

  • ఈ ప్రభుత్వం తన ఉచ్చును తానే బిగించుకుంటోంది
  • కశ్మీర్ ప్రశాంతంగా ఉంటే 9 లక్షల మందితో పహారా ఎందుకు?
  • ఆందోళనను అణచివేసేందుకే ఇదంతా

జమ్ముూకశ్మీర్‌లో గ‌ృహ నిర్బంధంలో ఉన్న ముగ్గురు నేతలను బాండ్లపై సంతకాలు పెట్టించుకుని విడుదల చేయడంపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి నిర్బంధమే చట్టవిరుద్ధమైనప్పుడు, వారి విడుదలకు షరతులు ఏంటని ప్రశ్నించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. గృహ నిర్బంధంలో ఉన్న ముగ్గురు నేతలను నిన్న ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సందర్భంగా బాండ్లపై సంతకాలు తీసుకున్నట్టు వార్తలు వచ్చాయి.

గృహ నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీ ఈ వార్తలపై స్పందించారు. వారి నిర్బంధమే చట్ట విరుద్ధమైనప్పుడు, ఏ చట్టం కింద వారిని షరతులతో విడుదల చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. చుక్కాని లేకుండా ప్రయాణిస్తున్న ఈ ప్రభుత్వం తన ఉచ్చును తానే బిగించుకుంటోందని విమర్శించారు. అలాగే, జమ్ముూకశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని ప్రభుత్వం ప్రకటించడంపైనా ఆమె మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్నదే నిజమైతే రాష్ట్రంలో ఇంకా 9 లక్షల మంది భద్రతా సిబ్బంది ఎందుకు పహారా కాస్తున్నట్టని ప్రశ్నించారు. ఆందోళనను అణచివేసేందుకే ప్రభుత్వం వారిని మోహరించిందని ముఫ్తీ ఆరోపించారు.

More Telugu News