Telangana: మరో రెండు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలు

  • తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేని వానలు
  • యాదాద్రి జిల్లా రామన్నపేటలో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
  • కుత్బుల్లాపూర్‌లో నిన్న ఒక్క రోజే 6.3 సెంటీమీటర్ల వర్షపాతం

బుధవారం అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు మరో రెండురోజులపాటు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు ఎడతెరపి లేకుండా వానలు కురిశాయి.

యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలో అత్యధికంగా 13.3 సెంటీమీటర్ల వర్షం కురవగా, ఖమ్మం జిల్లా ఏన్కూరులో 9.3, ములుగు జిల్లా గోవిందరావుపేటలో 7.5, వెంకటాపురం మండలం అలుబాక 7.3, మహబూబ్‌నగర్‌లోని హన్వాడలో 7, జగిత్యాల జిల్లా ఇనుగుర్తిలో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం కురిసింది. కుత్బుల్లాపూర్‌లో అత్యధికంగా 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

More Telugu News