Chiranjeevi: రేపు ముఖ్యమంత్రి జగన్ ను కలవనున్న చిరంజీవి

  • తెలుగు రాష్ట్రాల్లో 'సైరా' విజయవిహారం 
  • ఇప్పటికే చిత్రాన్ని వీక్షించిన తెలంగాణ గవర్నర్
  • జగన్ ను ఆహ్వానించనున్న చిరంజీవి  

'సైరా నరసింహారెడ్డి' సినిమాను చిరంజీవి తన కెరియర్లోనే ప్రతిష్ఠాత్మకంగా భావించారు. ఆ స్థాయికి ఎంతమాత్రం తగ్గకుండా చరణ్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ నెల 2వ తేదీన విడుదలైన ఈ చారిత్రక చిత్రం భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు ఈ సినిమాను చూసి చిరంజీవిని అభినందిస్తున్నారు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను వీక్షించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించడానికి గాను, చిరంజీవి ఆయన అపాయింట్ మెంట్ కోరారు. సీఎంవో కార్యాలయం అపాయింట్ మెంట్ ను ఖరారు చేసినట్టు తాజా సమాచారం. ఈ క్రమంలో రేపు (శుక్రవారం) ఉదయం 11 గంటలకు జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి - చరణ్ కలుస్తారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఆయనను చిరంజీవి కలవడం ఇదే మొదటిసారి. ఇక చిరంజీవి కోరిక మేరకు తెలంగాణ గవర్నర్ తమిళిసై కుటుంబ సమేతంగా ఇటీవల 'సైరా నరసింహ రెడ్డి' సినిమాను చూడటం .. ప్రశంసలు కురిపించడం తెలిసిందే.

More Telugu News