Telangana: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఐఏఎస్ కమిటీ హెచ్చరిక

  • ఆర్టీసీ సంఘాలు, ఐఏఎస్ కమిటీ చర్చలు విఫలం
  • సమ్మెకు వెళ్లాలని ఆర్టీసీ యూనియన్ల నిర్ణయం
  • సమ్మెలో పాల్గొంటే ఎస్మా ప్రయోగిస్తామన్న ఐఏఎస్ కమిటీ

తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె అనివార్యంగా కనిపిస్తోంది. ప్రభుత్వం నియమించిన ఐఏఎస్ కమిటీతో ఆర్టీసీ కార్మిక సంఘాల చర్చలు విఫలమయ్యాయి. దాంతో ఈ అర్థరాత్రి నుంచి టీఎస్ఆర్టీసీ సమ్మెబాట పట్టనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ఐఏఎస్ కమిటీ హెచ్చరికలు చేసింది. సమ్మెలో పాల్గొంటే ఎస్మా ప్రయోగిస్తామని స్పష్టం చేసింది. ఉద్యోగులను డిస్మిస్ చేస్తామని, తొలగించిన ఉద్యోగుల స్థానంలో కొత్తవారిని తీసుకుంటామని కమిటీ తెలిపింది.

కాగా, సమ్మె తప్పదన్న నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం నష్టనివారణ చర్యలు చేపట్టింది. తాత్కాలిక కండక్టర్లు, డ్రైవర్లతో సర్వీసులు నడిపించాలని ప్రయత్నాలు చేస్తోంది. అవసరమైతే పోలీసుల సాయంతో సర్వీసులు నడపాలని, స్కూలు బస్సులు, ప్రైవేటు బస్సులను అద్దెకు తీసుకోవాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. సమ్మె కారణంగా క్యాబ్ లు, ప్రైవేట్ బస్సులు అధిక చార్జీలు వసూలు చేయరాదని సర్కారు స్పష్టం చేసింది. కాగా, ఇప్పటికే దూరప్రాంత సర్వీసులు నిలిచిపోయినట్టు తెలుస్తోంది. ఈ రాత్రికి మరిన్ని సర్వీసులు నిలిచిపోనున్నాయి.

More Telugu News