Shah Mahmood Qureshi: పాకిస్థాన్ టీవీ ఛానల్ అడిగిన ప్రశ్నకు విరుచుకుపడ్డ పాక్ మంత్రి.. మీ ఇష్టం వచ్చినట్టు రాసుకోండంటూ ఆగ్రహం!

  • మాకు 58 దేశాల మద్దతు ఉందంటూ ఐక్యరాజ్యసమితిలో ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్య
  • ఆ దేశాలు ఏవో చెప్పాలని ఖురేషీని ప్రశ్నించిన పాక్ టీవీ
  • ఎవరి అజెండాతో మీరు పని చేస్తున్నారంటూ చిందులు

ఇండియా దెబ్బకు అంతర్జాతీయ సమాజం ముందు పాకిస్థాన్ ఒంటరి అయిపోయింది. ఓ వైపు భారత ప్రధాని మోదీ దూకుడు పెంచుతుంటే... పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాత్రం ఏమి చేయాలో తోచని పరిస్థితిలో చిక్కుకుపోయారు. జమ్మూకశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాకిస్థాన్ చెబుతున్న నంగనాచి కబుర్లను మూడు దేశాలు (చైనా, టర్కీ, మలేషియా) మినహా మరే దేశం కానీ, ఐక్యరాజ్యసమితి కానీ వినడం లేదు. మరోవైపు ఇటీవల జరిగిన ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ లో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, కశ్మీర్ వివాదానికి సంబంధించి తమకు 58 దేశాల మద్దతు ఉందని చెప్పారు.

ఇదే విషయంపై పాక్ విదేశాంగ మంత్రి మహ్మూద్ ఖురేషీని పాకిస్థాన్ కు చెందిన ఎక్స్ ప్రెస్ న్యూస్ టీవీ ఛానల్ ప్రశ్నించింది. పాక్ కు మద్దతిస్తున్న ఆ 58 దేశాల పేర్లను చెప్పాలని సదరు ఛానల్ ప్రశ్నించగా... ఖురేషీ కంట్రోల్ కోల్పోయారు. ఎవరి అజెండాతో మీరు పని చేస్తున్నారంటూ చిందులు తొక్కారు. పాకిస్థాన్ కు ఎవరు మద్దతిస్తున్నారు? ఎవరు ఇవ్వడం లేదు? అనే విషయాన్ని మీరు నన్ను అడగాలనుకుంటున్నారా? అంటూ మండిపడ్డారు. మీకు ఇష్టం వచ్చినట్టుగా రాసుకోండంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News