East Godavari District: తండ్రిని గొడ్డలితో నరికి చంపి.. పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయిన కుమారులు

  • పొలం విషయంలో తండ్రితో గొడవలు
  • తండ్రిని ఒకరు గట్టిగా పట్టుకుంటే మరొకరు నరికి చంపిన వైనం
  • తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

పొలం వ్యవహారంలో తాము చెప్పిన మాటను వినడం లేదన్న అక్కసుతో సొంత తండ్రినే దారుణంగా నరికి చంపారు ఇద్దరు కుమారులు. తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలంలోని దొండగూడెం గిరిజన గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన మడివి బుచ్చయ్య (48).. తన ఇద్దరు కుమారులు సోమయ్య, సన్యాసిరావులతో కలిసి నివసిస్తున్నాడు. నెల రోజులుగా పొలానికి సంబంధించిన వ్యవహారంలో తండ్రీ కుమారుల మధ్య విభేదాలు నెలకొన్నాయి. పొలం విషయమై మంగళవారం మరోమారు వీరి మధ్య గొడవ జరిగింది. అదికాస్తా పెద్దదైంది.

తాము చెప్పింది వినడం లేదన్న కోపంతో కుమారులు ఇద్దరూ తండ్రిపై గొడ్డలితో దాడిచేశారు. సన్యాసిరావు తండ్రిని కదలకుండా గట్టిగా పట్టుకుంటే సోమయ్య గొడ్డలితో తండ్రిని నరికి చంపాడు. అనంతరం ఇద్దరూ కలిసి వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News