Telangana: అధికారులు వేధిస్తున్నారంటూ.. తనను తాను గోతిలో పూడ్చుకోబోయిన రైతు!

  • మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలంలో ఘటన
  • పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన
  • తన సోదరుడితో ఎమ్మెల్యే కుమ్మక్కయ్యారని ఆరోపణ

తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్ జిల్లాలో ఓ రైతు చేసిన పని కలకలం రేపింది. స్థానిక ఎమ్మెల్యే తన సోదరుడితో కుమ్మక్కై తనకు పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ  నర్సింహులపేట మండలం రామన్నగూడేనికి చెందిన రైతు మేక ప్రభాకర్‌రెడ్డి తనను తాను గోతిలో పూడ్చుకోబోయాడు. సోమవారం పెద్ద గొయ్యి తీసుకుని అందులో కూర్చుని తనపై మట్టివేసుకునేందుకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు అడ్డుకుని అతడిని బయటకు లాక్కొచ్చారు.  

తమ కుటుంబానికి మొత్తం 15 ఎకరాల భూమి ఉండగా, అందులో ఐదెకరాలు తనవేనని ప్రభాకర్‌రెడ్డి తెలిపాడు. తన భూమికి రైతుబంధు నిధులు కూడా వస్తున్నట్టు పేర్కొన్నాడు. అయితే, ఆ భూమికి పట్టాదారు పాస్ పుస్తకం ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని ఆరోపించాడు. తన తమ్ముడికి ఇచ్చి తనకు ఇవ్వకుండా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే ఆపమన్నారని అధికారులు చెప్పారని ప్రభాకర్‌రెడ్డి తెలిపాడు. తనకు వెంటనే పట్టదారు పాస్ పుస్తకం ఇప్పించాలని కోరాడు.  

More Telugu News