Lalu Prasad Yadav: మూడు నెలలుగా తిండి కూడా పెట్టడం లేదు: లాలూ ప్రసాద్ కోడలు ఐశ్వర్య

  • తాగడానికి నీరు కూడా ఇవ్వడం లేదు
  • పుట్టింటివారు పంపుతున్న ఆహారంతోనే కడుపు నింపుకుంటున్నా
  • మీసాభారతి వల్లే సమస్య పెద్దది అయింది

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. తాజాగా, లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు నెలలుగా తనకు తిండి కూడా పెట్టడం లేదని ఆమె తన అత్త రబ్రీదేవి, ఆడపడుచు మీసా భారతిపై ఆరోపణలు గుప్పించారు. తనను వంటింట్లోకి కూడా రానీయడం లేదని చెప్పారు. భార్యతో విడాకులు కోరుతూ ఆరు నెలల క్రితం తేజ్ ప్రతాప్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తమ కాపురం నిలబడుతుందనే ఆశతో ఐశ్వర్యారాయ్ తన అత్తతోనే కలిసి ఉంటోంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రెస్ మీట్ పెట్టి అత్తింటివారిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తన అత్తింటివారు తనను తీవ్రంగా వేధిస్తున్నారని ఈ సందర్భంగా ఐశ్వర్యారాయ్ ఆవేదన వ్యక్తం చేశారు. వంటగదికి తాళాలు వేస్తున్నారని, కనీసం తాగడానికి నీరు కూడా ఇవ్వడం లేదని అన్నారు. ఇంట్లో నెలకొన్న పరిస్థితిని వీడియో తీస్తుంటే రబ్రీదేవి బాడీ గార్డ్ వచ్చి తన ఫోన్ లాక్కున్నారని చెప్పారు. తనను తన భర్త, మరిది ఇబ్బంది పెట్టడం లేదని... ఆడపడుచు మీసాభారతి వల్లే సమస్య పెద్దదయిందని మండిపడ్డారు. మూడు నెలలుగా పుట్టింటివారు పంపుతున్న ఆహారంతోనే కడుపునింపుకుంటున్నానని చెప్పారు. ఈ నేపథ్యంలో తన తండ్రి చంద్రికా రాయ్ తో కలసి లాలూ అవుట్ హౌస్ లో ఆమె ధర్నాకు దిగారు. దీనికి తోడు ఆమె మహిళా హెల్ప్ లైన్ కు ఫోన్ చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.

More Telugu News