hussensagar: నిండుకుండలా హుస్సేన్‌సాగర్‌... గేట్లు ఎత్తి మూసీ కాల్వలోకి వరద నీరు విడుదల

  • 26 తూముల నుంచి నీటి విడుదల
  • 3,486 క్యూసెక్కుల నీరు దిగువకు
  • పరీవాహక ప్రజల్ని అప్రమత్తం చేసిన అధికారులు

హైదరాబాద్‌ నగరం నడిబొడ్డున ఉన్న చారిత్రక హుస్సేన్‌సాగర్‌ నిండుకుండలా మారడం, పైనుంచి వరద ప్రవాహం వస్తుండడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని మూసీ కాల్వలోకి విడుదల చేస్తున్నారు. రెండు రోజుల నుంచి నగర పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. పైనుంచి వస్తున్న వరదను దృష్టిలో పెట్టుకుని అధికారులు మొత్తం 26 తూముల ద్వారా 3,486 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

కవాడిగూడ, అశోక్‌నగర్‌, చిక్కడపల్లి, బాగ్‌లింగంపల్లి, కోరంటి ఆసుపత్రి, సత్యానగర్‌, రత్నానగర్‌ మీదుగా మూసీ ప్రధాన కాల్వలోకి వరద నీటిని విడుదల చేస్తుండడంతో పరీవాహక ప్రాంతంలో ఉన్న నివాసితులను అధికారులు అప్రమత్తం చేశారు. వరద వస్తోందని, ప్రజలు నదిలోకి దిగరాదని హెచ్చరికలు చేస్తున్నారు.

కాగా, గత ఏడాది చేపట్టాల్సిన పూడిక తీత పనులు సరిగా చేపట్టక పోవడంతో ఈ ఏడాది వరద ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఇదే విధంగా మరో వారం రోజు వర్షాలు పడితే రెండువేల సంవత్సరం నాటి ఉపద్రవం రావచ్చునని భయపడుతున్నారు.

More Telugu News