Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. భర్తను బంధించి భార్యపై సామూహిక అత్యాచారం

  • పనిచేస్తున్న ఫాం హౌస్ యజమానులతో బాధితులకు గొడవ
  • ఇద్దరినీ బంధించిన నిందితులు
  • మరో ఇద్దరితో కలిసి మహిళపై అత్యాచారం

హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. భర్తను బంధించిన నలుగురు వ్యక్తులు అతడి భార్యపై సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. స్థానికంగా సంచలనమైన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగర్‌కర్నూలు జిల్లా ఎనిమిల్లతండాకు చెందిన చందు భార్యాపిల్లలతో కలిసి మహేశ్వరం మండలంలోని హర్షగూడలో నివసిస్తున్నాడు.

స్థానికంగా ఓ ఫాంహౌస్‌లో పనిచేసే చందు.. ఈ నెల 18న ఫాంహౌస్ యజమానులు రంగారెడ్డి, ప్రతాప్‌రెడ్డిలతో గొడవ పడ్డాడు. ఇది కాస్తా పెద్దది కావడంతో చందు, అతడి భార్యను వారు ఫాంహౌస్‌లో బంధించారు. అనంతరం చందు భార్యను మరో గదిలోకి తీసుకెళ్లి రంగారెడ్డి, ప్రతాప్‌రెడ్డితోపాటు మరో ఇద్దరు అత్యాచారానికి పాల్పడ్డారు.

అదే రోజు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బాధితులు వెళ్లగా మధ్యలోనే అడ్డుకున్న నిందితుల బంధువులు వారిని బుజ్జగించి స్వస్థలమైన నాగర్‌కర్నూలు జిల్లాకు పంపించివేశారు. అయితే, గ్రామస్థుల సహకారంతో గురువారం తిరిగి నగరానికి చేరుకున్న చందు దంపతులు పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News