మేడ్చల్ జిల్లాలో దారుణం.. చేతబడి పేరుతో యువకుడి దారుణహత్య

  • అనారోగ్యంతో మృతి చెందిన మహిళ
  • ఆమె మృతికి గ్రామానికి చెందిన యువకుడి చేతబడే కారణమని అనుమానం
  • యువకుడిని చంపి తగలబెట్టిన ఆమె బంధువులు  
మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందడానికి యువకుడి చేతబడే కారణమని భావించిన ఆమె బంధువులు అతడిపై దాడిచేసి గొడ్డలితో నరికి చంపేశారు.

 పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన గ్యార లక్ష్మి (45) ఆరేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందింది. అయితే, ఆమె అనారోగ్యంతో మృతి చెందడానికి గ్రామానికి చెందిన ఆంజనేయులు (24) కారణమని ఆమె బంధువులు అనుమానించారు. నిన్న సాయంత్రం లక్ష్మికి అంత్యక్రియులు నిర్వహించిన తర్వాత ఆంజనేయులు అక్కడికి వస్తాడని భావించారు. అతడి కోసం అక్కడ వేచి చూశారు.

అదే సమయంలో ఆంజనేయులు అక్కడికి అనుకోకుండా రావడంతో వారి అనుమానం బలపడింది. వెంటనే అతడిని పట్టుకుని గొడ్డలితో నరికి చంపేశారు.  అనంతరం లక్ష్మికి దహనసంస్కారాలు నిర్వహించిన స్థలంలోనే అతడిని కూడా తగలబెట్టేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Medchal Malkajgiri District
shameerpet
murder

More Telugu News