Oscar: ఆస్కార్ కు నామినేట్ అయిన భారత రైతు జీవితగాథతో కూడిన డాక్యుమెంటరీ!

  • భారత్ నుంచి ఆస్కార్ కు వెళ్లిన 'మోతీ భాగ్' డాక్యుమెంటరీ
  • ఆదర్శప్రాయంగా నిలిచిన రైతు విద్యాదత్ శర్మ
  • శర్మ జీవితాన్ని ఆకట్టుకునేలా తెరకెక్కించిన నిర్మల్ చందర్

ఆస్కార్ పురస్కారాల్లో భారత్ ముద్ర చాలా తక్కువ. భారత్ నుంచి క్రమం తప్పకుండా నామినేషన్లు వెళుతున్నా, అవార్డులు గెలుచుకోవడం ఎంతో అరుదైన విషయం. తాజాగా, ఓ భారత రైతు జీవితగాథతో తెరకెక్కిన మోతీభాగ్ అనే డాక్యుమెంటరీ చిత్రం ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయింది. హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ఓ కుగ్రామానికి చెందిన విద్యాదత్ శర్మ అనే రైతు సాగించిన పోరాటమే ఈ చిత్ర ఇతివృత్తం.

ఉత్తరాఖండ్ లోని పౌరీ గఢ్వాల్ ప్రాంతానికి చెందిన విద్యాదత్ వ్యవసాయ ఉద్యమకారుడు అని చెప్పవచ్చు. తన ప్రాంతంలో అందరూ వ్యవసాయం వదిలి ఉద్యోగాల వైపు పరుగులు పెట్టినా తాను మాత్రం స్వగ్రామంలోనే ఉండి సేద్యం చేయడానికే మొగ్గుచూపాడు. ప్రభుత్వ ఉద్యోగం లభించే అవకాశాన్ని కూడా వద్దనుకుని పంటపొలాలకే అంకితమయ్యాడు. భారత్ లో అత్యంత నాణ్యమైన రాడిష్ దుంపలు పండేది విద్యాదత్ శర్మ పొలంలోనే అంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు, భారత్ లో అత్యంత పెద్దదైన రాడిష్ దుంపను కూడా శర్మే పండించాడు.

శర్మ రైతు మాత్రమే కాదు, మంచి సాహితీవేత్త కూడా. పద్యాలు రాయడం, పాడడం శర్మకు వ్యవసాయేతర అభిరుచి అని చెప్పాలి. ఆయన జీవితం ఆధారంగా నిర్మల్ చందర్ దండ్రియాల్ డాక్యుమెంటరీ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ ఫిల్మ్ ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయిందని ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ తెలిపారు. ఈ మేరకు దర్శకుడు నిర్మల్ చందర్ కు అభినందనలు తెలిపారు.

More Telugu News