ISRO: విక్రమ్ ల్యాండర్ పై ఆశలు వదిలేసుకున్నట్టేనా..?

  • కీలకదశలో మొండికేసిన విక్రమ్ ల్యాండర్
  • విక్రమ్ ను కదిలించేందుకు ఇస్రో విఫలయత్నాలు
  • నాసా సహకారం కోరిన భారత్!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్టులో కీలకమైన విక్రమ్ ల్యాండర్ మొరాయించడం తెలిసిందే. చంద్రుడిపై సాఫీగా దిగాల్సిన విక్రమ్, అనుకోని విధంగా మూగబోయింది. ఈ నేపథ్యంలో, విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు అందుకోవడానికి గత కొన్నిరోజుల నుంచి ఇస్రో వర్గాలు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. చివరికి నాసా సహకారం కూడా తీసుకున్నట్టు తెలిసింది.

అయితే, విక్రమ్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఇక దానిపై ఆశలు వదిలేసుకున్నట్టేనన్న భావన కలుగుతోంది. ఇస్రో తాజా ప్రకటన కూడా అందుకు తగ్గట్టుగానే ఉంది. విక్రమ్ ల్యాండర్ లో కదలికలు తెచ్చే ప్రయత్నాలు ఎంతకీ సఫలీకృతం కాని తరుణంలో, ఇప్పటివరకు తమకు మద్దతుగా నిలిచిన భారతీయులందరికీ కృతజ్ఞతలు అంటూ ఇస్రో ఓ ప్రకటన చేసింది. 'ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల ఆశలు, వారి స్వప్నాలే మాకు స్ఫూర్తి. మరింత ఉత్సాహంతో కొనసాగుతాం' అంటూ ఇస్రో ట్విట్టర్ లో పేర్కొంది.

More Telugu News