Chittoor District: ప్రేమికులకు వేర్వేరు పెళ్లిళ్లు.. పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్న ప్రేమజంట

  • చిత్తూరు జిల్లాలో ఘటన
  • నెల రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతీయువకులు
  • కర్ణాటకలో శవాలై కనిపించిన వైనం

మరో ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. ప్రేమించిన వారితో పెళ్లికి నిరాకరించిన పెద్దలు ఇద్దరికీ వేర్వేరుగా వివాహాలు జరిపించారు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ప్రేమికులు ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చిత్తూరు జిల్లాలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. వి.కోట మండలంలోని గెస్తింపల్లెకు చెందిన నీలకంఠ (32), చల్లప్పల్లెకు చెందిన లలిత (28) ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే, వీరి ప్రేమను నిరాకరించిన ఇరు కుటుంబాల పెద్దలు ఇద్దరికీ వేర్వేరు వ్యక్తులతో వివాహాలు జరిపించారు.

ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కాలేదన్న మనస్తాపంతో ఉన్న వీరిద్దరూ గత నెలలో కుటుంబ సభ్యులతో గొడవపడి ఇల్లొదిలి వెళ్లిపోయారు. వీరి కోసం గాలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. సోమవారం కర్ణాటకలోని కోలారు జిల్లా బేతమంగళం చెరువు సమీపంలో వీరిద్దరూ విగతజీవులుగా కనిపించారు. పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్టు గుర్తించిన పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News