Maharashtra: లక్షన్నర విలువైన మంగళసూత్రం గుటుక్కుమనిపించిన ఎద్దు!

  • మహారాష్ట్రంలో ఘటన
  • బైల్ పోలా పండుగ నిర్వహించిన రైతులు
  • మంగళసూత్రాన్ని కూడా నైవేద్యంతో పాటు లాగించిన ఎద్దు

మహారాష్ట్రంలో నమ్మశక్యం కాని రీతిలో ఓ ఎద్దు మహిళ మెడలోని మంగళసూత్రాన్ని గుటుక్కుమనిపించింది. మహారాష్ట్రంలో రైతులు ప్రతి సంవత్సరం ఆగస్టు 30న బైల్ పోలా అనే పండుగ నిర్వహిస్తారు. తమ ఇంట ఉండే ఎద్దులను అందంగా ముస్తాబు చేయడమే కాకుండా వాటికి పూజలు చేస్తారు. రైతీ వాఘాపూర్ అనే గ్రామంలో కూడా రైతులు బైల్ పోలా ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని ఓ మహిళ తమ రెండు ఎద్దులకు పూజలు చేసి నైవేద్యం సమర్పించేందుకు సిద్ధమైంది. హారతిపళ్లెంలో తన మంగళసూత్రాన్ని కూడా ఉంచి ఎద్దుకు హారతి ఇచ్చింది. నైవేద్యంగా చపాతీలు ఉంచారు.

ఇంతలో కరెంటు పోవడంతో మహిళ కొవ్వొత్తి తెచ్చేందుకు లోపలికి వెళ్లింది. కొవ్వొత్తి తెచ్చేసరికి హారతిపళ్లెంలో ఉండాల్సిన మంగళసూత్రం కనిపించలేదు. ఆ ఎద్దు చపాతీలతో పాటు మంగళసూత్రాన్ని కూడా స్వాహా చేసింది. పేడలో బయటికి వస్తుందని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. చివరికి ఆ ఎద్దుకు శస్త్రచికిత్స నిర్వహించి మంగళసూత్రాన్ని బయటికి తీయాల్సి వచ్చింది. లక్షన్నర రూపాయల విలువైన ఆ మంగళసూత్రం తిరిగి తమకు దక్కడంతో ఆ ఇల్లాలు ఆనందం అంతా ఇంతా కాదు!

More Telugu News