Kurnool District: భార్య నిలదీస్తోందని బలవంతంగా నోట్లో పురుగుల మందు పోసిన భర్త

  • కర్నూలు జిల్లా మహానంది మండలంలో ఘటన
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
  • ఆసుపత్రిలో చేర్చిన పోలీసులు 

తన తీరును నిలదీసిందన్న ఆగ్రహానికి గురైన ఓ భర్త కుటుంబ సభ్యులతో కలిసి భార్య నోట్లో బలవంతంగా పురుగుల మందు పోశాడు. కర్నూలు జిల్లా మహానంది మండలం ఎం.తిమ్మాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎం.తిమ్మాపురం పరిధి కొత్తపేటకు చెందిన నూర్జహాన్‌, రసూల్‌ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. మద్యానికి బానిసైన రసూల్‌ ఇంటి నిర్వహణే పట్టించుకోవడం మానేశాడు. ఈ నేపథ్యంలో మూడు రోజుల నుంచి ఎక్కడికి వెళ్లాడో తెలియని భర్త నిన్న సాయంత్రం హఠాత్తుగా ప్రత్యక్షం కావడంతో నూర్జహాన్‌ అసహనానికి లోనైంది.

ఇల్లు, పిల్లలు పట్టకుండా తిరుగుతుంటే గడిచేది ఎలా అంటూ భర్తను నిలదీసింది. దీంతో భర్త రసూల్‌ ఆగ్రహోదగ్రుడయ్యాడు. తన తల్లి మౌలాబీ, చిన తల్లి రమీబీ, సోదరుడు కరీముల్లాలతో కలిసి బలవంతంగా ఇంట్లో ఉన్న పురుగుల మందును నూర్జహాన్‌ నోట్లో పోశాడు. దీంతో బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేశారు.

More Telugu News