Madapur: మాదాపూర్ సీఐ ఆదర్శం... ఏడుగురు పోలీసుల బైక్ లు సీజ్!

  • స్టేషన్ కు వచ్చిన బైక్ ల పత్రాల పరిశీలన
  • ఆర్సీ, ఇన్స్యూరెన్స్ లేని పోలీసు వాహనాలు సీజ్
  • రూల్స్ ఎవరికైనా ఒకటేనన్న ఇనస్పెక్టర్ రాజగోపాల్ రెడ్డి

"రూల్‌ ఈజ్‌ రూల్‌ - రూల్‌ ఫర్‌ ఆల్‌" అనే మాటను పాటించిన హైదరాబాద్, మాదాపూర్‌ ఇనస్పెక్టర్‌ రాజగోపాల్‌ రెడ్డిపై ఇప్పుడు ప్రశంసల వర్షం కురుస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు కఠినతరమై, ప్రజలు గగ్గోలు పెడుతున్న వేళ, నిబంధనలను ఎవరైనా పాటించాల్సిందేనంటూ, ఉదయాన్నే పోలీసు స్టేషన్ కు బైకులపై దర్జాగా వచ్చిన పోలీసులందరి వద్దా ఉన్న పత్రాలను పరిశీలించిన రాజగోపాల్ రెడ్డి, సరైన పత్రాలు లేవంటూ ఏడుగురి వాహనాలను సీజ్ చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేశారు.

ప్రజల వద్ద పత్రాలు లేవంటూ, వేలల్లో జరిమానాలు విధించే పోలీసులు, తమను ఎవరు అడ్డుకుంటారులే అన్న ఉద్దేశంతో హెల్మెట్‌, లైసెన్స్‌ లేకపోయినా దర్జాగా వెళ్తుంటారని మండిపడే వారికి తనదైన శైలిలో ఆయన సమాధానం ఇచ్చారు. నిబంధనలు పోలీసులకు కూడా వర్తిస్తాయని, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, డీసీపీ విజయ్‌ కుమార్‌ సూచనల మేరకు పోలీసు సిబ్బంది వాహనాలను తనిఖీ చేశామని అన్నారు.

తమ స్టేషన్ లోని పోలీసుల వాహనాల్లో ఆర్సీ, ఇన్స్యూరెన్స్ లేని వాహనాలను గుర్తించి సీజ్ చేశామని, ప్రజలకు రూల్స్‌ చెప్పేముందు పోలీసుల వాటిని తప్పనిసరిగా పాటించాల్సిందేనని అన్నారు.

More Telugu News