Pub Ji: పబ్ జీకి బానిసై... ఫోన్ రీచార్జ్ కి డబ్బివ్వలేదని, తండ్రిని హత్య చేసిన యువకుడు!

  • కర్ణాటకలో బెళగావి సమీపంలో ఘటన
  • గేమ్ కు అలవాటు పడి రక్తం కావాలని అరుపులు
  • తండ్రిని చంపి, ముక్కలు చేసిన వైనం

పబ్‌ జీ గేమ్‌ కు బానిసైన ఓ యువకుడు ఉన్మాదిగా మారి కన్నతండ్రిని పెద్ద కత్తితో ముక్కలుగా నరికి చంపిన ఘటన కర్ణాటకలో బెళగావి సమీపంలో ఉన్న కాకతీ కాలనీలో కలకలం రేపింది. స్మార్ట్ ఫోన్ డేటా రీచార్జ్ కోసం డబ్బులు ఇవ్వలేదన్న ఆగ్రహంతో కన్నతండ్రినే దారుణాతి దారుణంగా హత్య చేశాడు. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, శంకరప్ప కమ్మార (60) అనే వ్యక్తికి, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిప్లొమా కోర్సు చదివిన రఘువీర్‌ (21) అనే కొడుకున్నాడు.

ఇంట్లో ఖాళీగా ఉంటున్న రఘువీర్ తన వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్ లో పబ్ జీ ఆటకు అలవాటు పడ్డాడు. అర్థరాత్రి పూట విచిత్రంగా ప్రవర్తించేవాడు. ఓసారి రక్తం కావాలంటూ పొరుగింటి వారిని అరుస్తూ అడిగాడు. అతని ఆగడాలపై ఇరుగు, పొరుగువారు పోలీసులను ఆశ్రయించగా, రఘువీర్ ను, అతని తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించిన పోలీసులు, కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు.

ఈ క్రమంలో మొబైల్ రీచార్జ్ చేసుకోవడానికి ఆదివారం అర్థరాత్రి తరువాత తండ్రిని డబ్బులడిగాడు. అందుకు తండ్రి నిరాకరించడంతో వీరి మధ్య గొడవ జరిగింది. దాంతో ఒక్కసారిగా రఘువీర్‌ లోని ఉన్మాది బయటకు వచ్చాడు. తల్లిని మరో గదిలోకి నెట్టేసి గడియపెట్టాడు. కిచెన్ లోని కత్తి తీసుకువచ్చి తండ్రిపై దాడి చేసి, గొంతు కోసేశాడు. అక్కడితో ఆగని రఘువీర్ లోని ఉన్మాది, తండ్రి చేతుల్ని, కాళ్లను శరీరం నుంచి వేరు చేశాడు.

తల్లి అరుపులతో చుట్టుపక్కల వారు విషయాన్ని గమనించి పోలీసులకు చెప్పి, శంకరప్పను ఆసుపత్రికి తరలించగా, ఆయన అప్పటికే మరణించాడని తెలిపారు. పోలీసులు అతికష్టం మీద రఘువీర్ ను బంధించి, స్టేషన్‌ కు తరలించారు.

More Telugu News