Andhra Pradesh: టీమ్ ఇస్రో.. దేశమంతా మీవెంటే ఉంది.. మనం అనుకున్నది మున్ముందు సాధిస్తాం!: చంద్రబాబు

  • చంద్రయాన్-2లో అవాంతరాలు
  • విక్రమ్ ల్యాండర్ నుంచి సిగ్నల్స్ కట్
  • ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ అధినేత

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 ప్రయోగంలో చివరిక్షణంలో అవాంతరాలు ఎదురైన సంగతి తెలిసిందే. చంద్రుడిపై ల్యాండర్ ‘విక్రమ్’ 2.1 కిలోమీటర్ల ఎత్తులో ఉండగా, ఒక్కసారిగా సిగ్నల్స్ తెగిపోయాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. భారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు చేసిన కృషి, సవాళ్లను ఎదుర్కొన్న తీరుకు భారత్ గర్విస్తోందని చంద్రబాబు ప్రశంసించారు.

ల్యాండర్ విక్రమ్ విషయంలో ఆఖరి క్షణంలో అవరోధం ఎదురైనా ఇప్పటివరకూ సాధించింది తక్కువేమీ కాదని అభిప్రాయపడ్డారు. ‘టీమ్ ఇస్రో.. దేశమంతా మీవెంటే ఉంది. మున్ముందు మనం అనుకున్నది సాధిస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.

More Telugu News