Tirupati: వివాహేతర సంబంధం అనుమానంతో భార్యను గొంతు నులిమి చంపిన భర్త

  • తిరుపతిలో ఘటన
  • కాపురానికి రమ్మంటే రానందని ఘాతుకం
  • పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసుల గాలింపు 

వివాహేతర సంబంధం కారణంగానే భార్య తనతో వచ్చేందుకు నిరాకరిస్తోందని అనుమానించిన భర్త.. ఆమెను దారుణంగా చంపేశాడు. తిరుపతిలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. గుంతకల్లుకు చెందిన శివయ్య-వాణి అలియాస్ ఓబులమ్మ (38) భార్యాభర్తలు. 20 ఏళ్ల క్రితం వీరికి వివాహం కాగా, ముగ్గురు పిల్లలున్నారు. 2015లో ఉపాధి కోసం తిరుపతి వలస వచ్చారు. శివయ్య ఆటోడ్రైవర్‌గా పనిచేసే వాడు. ఈ క్రమంలో భార్యను అనుమానిస్తూ తరచూ ఆమెతో గొడవపడేవాడు.  ఏడాది క్రితం శివయ్య పిల్లల్ని తీసుకుని గుంతకల్లు వెళ్లిపోయాడు. భార్య మాత్రం తిరుపతిలోనే ఉంటోంది.

రెండువారాల క్రితం పెద్దమనుషులు వీరి వ్యవహారంలో జోక్యం చేసుకున్నారు. ఇద్దరూ కలిసి ఉండి పిల్లల్ని చూసుకోవాలని సూచించారు. దీంతో భార్యను తీసుకెళ్లేందుకు గురువారం రాత్రి శివయ్య తిరుపతి వెళ్లాడు. అయితే, అతడితో వెళ్లేందుకు ఆమె నిరాకరించింది. దీంతో ఆమెపై పెంచుకున్న అనుమానం మరింత బలపడింది. వివాహేతర సంబంధం వల్లే ఆమె తనతో వచ్చేందుకు నిరాకరిస్తోందని భావించిన శివయ్య భార్యను గొంతు నులిమి హత్య చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న శివయ్య కోసం గాలిస్తున్నారు.

More Telugu News