Andhra Pradesh: అనంతపురంలో దారుణం.. టీడీపీ నేతలకు చెందిన 23 ఎకరాల దానిమ్మ తోట నరికివేత!

  • బ్రహ్మసముద్రంలోని నాగిరెడ్డి పల్లెలో ఘటన
  • టీడీపీ నేతలు గంగమ్మ, వెంకటేశ్ ల పంట ధ్వంసం
  • నిన్న అర్ధరాత్రి దారుణం.. టీడీపీ నేతల ఆవేదన

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కక్షలు వికృతరూపం దాలుస్తున్నాయి. ఎన్నికలవరకే పరిమితం కాకుండా ఆస్తుల విధ్వంసం వరకూ చేరుకుంటున్నాయి. తాజాగా అనంతపురం జిల్లాలోని నాగిరెడ్డి పల్లె గ్రామంలో కొందరు దుండగులు రెచ్చిపోయారు. తెలుగుదేశం తరఫున జెడ్పీటీసీగా పనిచేసిన గంగమ్మ, టీడీపీ మాజీ కన్వీనర్ వెంకటేశ్ లకు చెందిన 23 ఎకరాల దానిమ్మ పంటను ధ్వంసం చేశారు.

నిన్న అర్ధరాత్రి దాటాక పొలంలోకి చొరబడ్డ గుర్తుతెలియని వ్యక్తులు 23 ఎకరాల్లోని దానిమ్మ చెట్లను నరికివేశారు. అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. దీంతో ఏపుగా ఎదిగిన పంట నాశనం కావడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై గంగమ్మ, వెంకటేశ్ లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ రాజకీయ ప్రత్యర్థులే ఈ దారుణానికి ఒడిగట్టారని ఆరోపించారు. దీంతో ఈ వ్యవహారంలో గుర్తుతెలియని దుండగులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News