Jammu And Kashmir: కశ్మీర్‌లో పరిశ్రమలు పెడితే... ఏడేళ్లపాటు పన్ను మినహాయింపు.. కేంద్రం యోచన

  • కశ్మీర్‌లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ఏర్పాటు యోచన
  • పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహకాలు
  • సరిహద్దు దళాల్లో కశ్మీర్, లడఖ్ యువతకు 50 వేల ఉద్యోగాలు

జమ్మూకశ్మీర్‌లో ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్రం.. కశ్మీర్, లడఖ్ పునర్నిర్మాణం కోసం ప్రణాళికలు రచిస్తోంది. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు పరిశ్రమల ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కశ్మీర్‌లో పెట్టుబడులు పెట్టేవారికి ఏడేళ్లపాటు పన్ను మినహాయింపుతోపాటు జీఎస్టీని కూడా మినహాయించాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.

కశ్మీర్‌లో త్వరలో పెట్టుబడుల సదస్సు నిర్వహించి ఈ విషయాన్ని వెల్లడించనున్నట్టు సమాచారం. కశ్మీర్‌లో పరిస్థితుల అధ్యయనానికి ప్రత్యేక బృందాన్ని కూడా పంపనున్నట్టు తెలుస్తోంది. అలాగే, కశ్మీర్, లడఖ్ యువతకు సరిహద్దు దళాల్లో 50 వేల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

More Telugu News