తమిళనాట బీజేపీ దళపతిగా రజనీకాంత్.... కలకలం రేపుతున్న కొత్త ప్రచారం!

  • మొన్నటి వరకూ బీజేపీ చీఫ్ తమిళిసై
  • తెలంగాణ గవర్నర్ గా నియామకం
  • ఖాళీ అయిన పదవికి రజనీ పేరు పరిశీలన
మొన్నటి వరకూ తమిళనాడులో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర దళపతి బాధ్యతలు నిర్వర్తించిన తమిళిసై సౌందరరాజన్, తెలంగాణ గవర్నర్ గా నియమించబడటంతో ఆ పదవి ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఇక తమిళనాడు కొత్త చీఫ్ గా దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ను నియమిస్తారంటూ, రాష్ట్రంలో సరికొత్త ప్రచారం మొదలైంది. ఇటీవలి కాలంలో బీజేపీకి దగ్గరైనట్టు కనిపిస్తున్న రజనీకాంత్, ఆ మధ్య నరేంద్ర మోదీ, అమిత్ షాలను కృష్ణార్జునులుగా అభివర్ణించారు కూడా. ఆర్టికల్ 370 రద్దును రజనీకాంత్ సమర్థించారు.

కాగా, బీజేపీ అధ్యక్ష పదవి రేసులో హెచ్ రాజా, పార్థసారథి, రాధాకృష్ణన్ లు కూడా ఉన్నట్టు తెలుస్తుండగా, బీజేపీ అధిష్ఠానం మాత్రం, ప్రజల్లో మరింత పాప్యులారిటీ ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో ఐదు రోజుల పాటు చెన్నైలోనే గడపనున్న తమిళిసై, వచ్చే వారంలో హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈలోగానే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది.
Go Back to Shorts
Rajanikant
Tamilnadu
BJP
President

More Telugu News