Telangana: హరీశ్‌రావు సీఎం కావాలంటూ జోగులాంబకు 1016 టెంకాయలతో మొక్కు!

  • కేసీఆర్‌ను చూసి ఎవరూ ఓట్లు వేయలేదు
  • హరీశ్‌ను, ఈటలను బయటకు పంపే కుట్ర జరుగుతోంది
  • హరీశ్‌ను కనీసం ఉప ముఖ్యమంత్రిని అయినా చేయాలి

మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలంటూ ఆయన అభిమానులు అలంపూర్ జోగులాంబకు మొక్కు చెల్లించుకున్నారు. రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్‌ ఎస్సీ సెల్‌ ఉపాధ్యక్షుడు చింతకుంట విష్ణు, వనపర్తి జిల్లా చందాపూర్‌‌కు చెందిన 25 మంది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు మంగళవారం జోగులాంబకు 1,016 టెంకాయలు కొట్టి మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ.. హరీశ్ రావును తెలంగాణకు ముఖ్యమంత్రిగా చేయాలని, లేదంటే ఉప ముఖ్యమంత్రి పదవి అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఉద్యమకారులను పక్కనపెట్టి పక్క పార్టీలోంచి వచ్చిన వారికి కేసీఆర్ పదవులు కట్టబెట్టారని మండిపడ్డారు. కేసీఆర్‌ను చూసి ఎవరూ ఓట్లు వేయలేదని, హరీశ్‌రావు మాటతీరు, పనితీరును చూసే ప్రజలు ఓట్లు వేశారని పేర్కొన్నారు. పార్టీ నుంచి హరీశ్‌ను, మంత్రి ఈటల రాజేందర్‌ను బయటకు పంపే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇకనైనా కేసీఆర్ కళ్లు తెరిపించాలని అమ్మవారిని కోరుకున్నట్టు వారు తెలిపారు.

More Telugu News