California: అమెరికాలో అగ్నికి ఆహుతైన పడవ.. నలుగురి మృతి.. 33 మంది ప్రయాణికుల గల్లంతు

  • శాంతాక్రూజ్ దీవి తీర ప్రాంతంలో ఘటన
  • నాలుగు మృతదేహాలను వెలికి తీసిన తీర ప్రాంత గస్తీ దళం
  • పడవలో ఎంతమంది ఉన్నారనే దానిపై స్పష్టత కరవు

అమెరికాలోని ఓ పడవ అగ్ని ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, 33 మంది ప్రయాణికులు గల్లంతయ్యారు. ఉత్తర కాలిఫోర్నియా సమీపంలోని శాంతాక్రూజ్ దీవి తీర ప్రాంతానికి సమీపంలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. స్కూబా డైవ్ చేసే వాణిజ్య పడవలో మంటలు చెలరేగినట్టు అమెరికా తీర రక్షక దళం తెలిపింది. ఇప్పటి వరకు ఐదుగురిని రక్షించామని, మరో 33 మంది గల్లంతయ్యారని  అధికారులు తెలిపారు. కాగా, ఇప్పటి వరకు నలుగురి మృతదేహాలను వెలికి తీశామని, వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. మిగతా వారి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. పడవలో ఎంతమంది ప్రయాణిస్తున్నారన్న విషయంలో స్పష్టత లేదని పేర్కొన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్న అధికారులు, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదన్నారు.

More Telugu News