President Of India: రాష్ట్రపతి భవన్ లో క్రీడా పురస్కారాల ప్రదానం.. ‘అర్జున’ అవార్డు అందుకున్న షట్లర్ సాయి ప్రణీత్

  • ఉత్తమ క్రీడాకారులు, కోచ్ లకు అవార్డులు
  • అర్జున, ద్రోణాచార్య, రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాలు
  • రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న విజేతలు

ప్రతి ఏటా ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఉత్తమ క్రీడాకారులకు, కోచ్ లకు క్రీడా పురస్కారాలను భారత ప్రభుత్వం అందజేసింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో నిర్వహించిన కార్యక్రమానికి విజేతలు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఆయా విజేతలు పురస్కారాలను అందుకున్నారు.

ఇటీవల జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం సాధించిన తెలుగు తేజం, ప్రముఖ షట్లర్ సాయి ప్రణీత్ అర్జున పురస్కారాన్ని అందుకున్నాడు. మహిళా క్రికెటర్ పూనమ్ యాదవ్, ఫుట్ బాల్ క్రీడాకారుడు గుర్ ప్రీత్ సింగ్, బాక్సర్ సోనియా లథర్, కబడ్డీ క్రీడాకారుడు అజయ్ ఠాకూర్ సహా మొత్తం 19 మంది క్రీడాకారులు అర్జున అవార్డులను అందుకున్నారు.

ద్రోణాచార్య పురస్కారాలు  అందుకున్న వారిలో బ్యాడ్మింటన్ కోచ్ విమలకుమార్, టేబుల్ టెన్నిస్ కోచ్ సందీప్ గుప్తా, హాకీ కోచ్ నజ్జబాన్ పటేల్, కబడ్డీ కోచ్ రాంబిర్ సింగ్ ఖోఖార్, క్రికెట్ కోచ్ సంజయ్ భరద్వాజ్ ఉన్నారు.

‘రాజీవ్ ఖేల్ రత్న’ అందుకున్న తొలి మహిళ దీపా మాలిక్

రాష్ట్రపతి చేతుల మీదుగా రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని ప్రముఖ పారా అథ్లెట్ దీపా మాలిక్ అందుకున్నారు. రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని అందుకున్న తొలి మహిళగానే కాకుండా, అతి పెద్ద వయస్కురాలిగా దీపా మాలిక్ చరిత్ర సృష్టించారు.

కాగా, రాజీవ్ ఖేల్ రత్న అవార్డు విజేత రెజ్లర్ భజరంగ్ పునియా, అర్జున అవార్డు విజేత క్రికెటర్ రవీంద్ర జడేజాతో పాటు మరో ఇద్దరు క్రీడాకారులు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు.

More Telugu News