Road Accident: పెద్దకర్మకు వెళ్లి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. శరీరం నుంచి వేరైన తల!

  • ఎదురుగా వస్తున్న బస్సు ఢీకొట్టడంతో ఘటన
  • బండి నడుపుతున్న వ్యక్తి తల తెగి పడిన వైనం
  • ఒళ్లు జలదరించే దృశ్యం

ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తులను బస్సు ఢీకొట్టిన ప్రమాదంలో బండి నడుపుతున్న వ్యక్తి తలతెగి దూరంగా పడిపోయింది. బంధువుల్లో ఒకరు చనిపోవడంతో వారింట్లో జరిగే పెద్దకర్మకు వెళ్తుండగా ఈ ఘటన జరగడం విశేషం. ఒళ్లు జలదరించే ఈ ఘటనతో స్థానికులకు కాసేపు నోటమాట రాలేదు.

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా బాపట్ల మండలం కంకటపాలెం గ్రామానికి చెందిన కలవకొల్లు గోపి (25), వీరనారాయణ ప్రకాశం జిల్లా పర్చూరు మండలం ఏటిగడ్డ ఉప్పరపాలెంలోని బంధువుల ఇంట్లో జరిగే పెద్దకర్మకు హాజరయ్యేందుకు నిన్న ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. బాపట్ల-జమ్ములపాలెం రోడ్డులోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలోకి వచ్చేసరికి ఎదురుగా వచ్చిన బస్సు  వీరి వాహనాన్ని ఢీకొట్టి వెళ్లిపోయింది.

ఈ ఘటనలో గోపి తల శరీరం నుంచి వేరై దూరంగా పడిపోయింది. ఈ హఠాత్పరిణామంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. తలలేని మొండెం చూసి ఆందోళనకు గురయ్యారు. వెనుక కూర్చున్న వీరనారాయణకు స్వల్ప గాయాలే అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ప్రమాదం జరిగే సమయానికి గోపి హెల్మెట్‌ పెట్టుకుని లేడు.

More Telugu News