Ishant Sharma: విజృంభించిన ఇషాంత్ శర్మ.. కుప్పకూలిన విండీస్

  • తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకే భారత్ ఆలౌట్
  • టాపార్డర్‌ను కుప్పకూల్చిన ఇషాంత్ శర్మ
  • 108 పరుగుల ఆధిక్యంలో భారత్

ఆంటిగ్వాలో విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో టీమిండియా  పట్టుబిగుస్తోంది. తొలి ఇన్నింగ్స్‌లో 297 పరుగులకే భారత్ ఆలౌట్ అయింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన విండీస్ 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ అతడికే క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత విండీస్ వికెట్లను వెంటవెంటనే చేజార్చుకుంది.

భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు కరీబియన్లు నిలబడలేకపోయారు. ముఖ్యంగా ఇషాంత్ శర్మ స్వింగ్‌కు విండీస్ టాపార్డర్ పేకమేడలా కుప్పకూలింది. మొత్తం ఐదు వికెట్లు తీసి విండీస్ బ్యాటింగ్ ఆర్డర్‌ను ఇషాంత్ కుప్పకూల్చాడు. 13 ఓవర్లు వేసి 42 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.

మరోవైపు బుమ్రా, షమీ, జడేజాలు చెరో వికెట్ తీసుకున్నారు. దీంతో విండీస్ రెండోరోజు ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసి భారత్ కంటే 108 పరుగుల వెనకబడి ఉంది. విండీస్ బ్యాట్స్‌మెన్‌లలో రోస్టన్ చేజ్ 48, షిమ్రన్ హెట్‌మెయిర్ 35, షాయ్ హోప్ 24, కాంప్‌బెల్ 23  పరుగులు చేశారు.

More Telugu News