Road Accident: కెమికల్‌ పౌడర్‌ లోడ్‌తో వెళ్తున్న లారీకి ప్రమాదం.. డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనం

  • విజయనగరం జిల్లా గుడివాడ గ్రామం వద్ద ఘోరం
  • ప్రమాదానికి గురై 26వ నంబరు జాతీయ రహదారిపై నిలిచిన ఓ లారీ
  • అదే లారీని కెమికల్‌ లోడు లారీ ఢీకొట్టడంతో ఘటన

కెమికల్‌ పౌడర్‌ లోడుతో వెళ్తున్న ఓ లారీ ఆగివున్న మరో లారీని ఢీకొట్టిన ప్రమాదంలో మంటలు చెలరేగి డ్రైవర్‌, క్లీనర్‌ సజీవ దహనమయ్యారు. 26వ నంబరు జాతీయ రహదారిపై విజయనగరం జిల్లా గజపతినగరం సమీపంలో ఈరోజు తెల్లవారు జామున ఈ ఘోరం చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గజపతినగరం మండలం గుడివాడ గ్రామం వద్ద ఓ లారీ ప్రమాదం బారిన పడి నిలిచి పోయింది. ఈరోజు తెల్లవారు జామున 3 గంటల సమయంలో ఇదే రోడ్డులో విశాఖ నుంచి పార్వతీపురం వైపు కెమికల్‌ పౌడర్‌ లోడ్‌తో మరో లారీ వెళ్తోంది. గుడివాడ వద్ద ఆగివున్న లారీని గుర్తించని కెమికల్ పౌడర్ లారీ డ్రైవర్ వెనుక నుంచి దాన్ని బలంగా ఢీకొట్టాడు.

ఈ ఘటనలో కెమికల్‌ లారీలో మంటలు చెలరేగి డ్రైవర్‌ రామచందర్‌యాదవ్‌ (40), క్లీనర్‌ ప్రకాష్‌ సింగ్‌(30)  సజీవదహనమయ్యారు. బాధితులు ఇద్దరూ మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా గుర్తించారు. ఈ ప్రమాదం కారణంగా తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది.  స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

More Telugu News