Andhra Pradesh: లోకేశ్ ఆర్మీ నన్ను చంపేస్తామని బెదిరిస్తోంది.. భద్రత కల్పించండి!: పోలీసులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఫిర్యాదు

  • లోకేశ్ ఆర్మీ, నాని చౌదరి పేరిట బెదిరింపులు
  • కరకట్ట నా నియోజకవర్గంలోకే వస్తుంది
  • చంద్రబాబు ఇంటిలోకి నేను వెళ్లలేదు

సోషల్ మీడియాలో తనను కొందరు బెదిరిస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు పోస్టులు పెట్టినవారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈరోజు తాడేపల్లిలోని పోలీస్ స్టేషన్ కు వచ్చిన రామకృష్ణారెడ్డిపై తనకు వస్తున్న బెదిరింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అందులో..‘నాని చౌదరి, లోకేశ్ టీమ్ పేరుతో  సోషల్ మీడియాలో నన్ను బెదిరిస్తూ పోస్టులు పెడుతున్నారు. చెన్నై టీడీపీ ఫోరమ్ పేరుతో సైతం అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.

మా నాయకుడు జగన్ ను జైలుకు పంపుతామనీ, నన్ను చంపేస్తామని బెదిరిస్తున్నారు’ అని తెలిపారు. టీడీపీ శ్రేణుల నుంచి తనకు ప్రాణహానీ ఉందనీ, తనకు భద్రత కల్పించాలని పోలీసులను కోరినట్లు రామకృష్ణారెడ్డి అన్నారు. కరకట్ట ప్రాంతం తన నియోజకవర్గంలో భాగం అయినందునే ఇక్కడ పర్యటించానని ఎమ్మెల్యే ఆర్కే చెప్పారు.

అంతేతప్ప తాను చంద్రబాబు నివాసంలోకి వెళ్లలేదని స్పష్టం చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించినా టీడీపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా తీర్పును టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్ ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు. నారా లోకేశ్ సోషల్ మీడియాలో తెరచాటు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

More Telugu News