USA: ట్రంప్ తో భేటీ 'టైమ్ వేస్ట్' అన్న స్వీడన్ అమ్మాయి

  • పర్యావరణం కోసం ఉద్యమిస్తున్న గ్రెటా
  • యూరప్ నుంచి అమెరికాకు సోలార్ బోటులో ప్రయాణం
  • ట్రంప్ ను కలిసేది లేదన్న బాలిక

పర్యావరణ కాలుష్యం కారణంగా భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన నీరు, గాలి ఉండదని పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నారు. అయితే స్వీడన్ కు చెందిన 16 ఏళ్ల గ్రెటా టూన్ బర్గ్ మాత్రం అంతటితో ఆగిపోలేదు. పలు పర్యావరణ సదస్సుల్లో పాల్గొనడంతో పాటు కాలుష్య ఉద్గారాల నియంత్రణ విషయంలో ప్రపంచదేశాలపై ఒత్తిడి తెస్తోంది. ఇందులో భాగంగా యూరప్ నుంచి అమెరికాకు ఓ సోలార్ బోటులో ప్రయాణం మొదలుపెట్టింది.

ఈ సందర్భంగా మీడియా ఆమెను ‘మీరు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కలుసుకుంటారా?’ అని ప్రశ్నించింది. దీనికి గ్రెటా స్పందిస్తూ..‘ఆయనతో మాట్లాడి నా సమయాన్ని నేను ఎందుకు వృథా చేసుకోవాలి? ఎలాగూ ఆయన నేను చెప్పేది వినరు కదా’ అని వ్యాఖ్యానించింది. అమెరికా కాలుష్య ఉద్గారాల నియంత్రణ విషయంలో తగినంత కృషి చేయడం లేదని గ్రెటా అభిప్రాయపడింది.

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రపంచదేశాలు ప్యారిస్ ఒప్పందం కుదుర్చుకోగా, తాము ఆ ఒప్పందం నుంచి బయటకొచ్చేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తాజాగా గ్రెటా టూన్ బర్గ్.. ట్రంప్ తీసుకున్న ఆ నిర్ణయంపైనే తన అసంతృప్తి వ్యక్తం చేసింది.

More Telugu News