Crime News: పరిచయస్థుడని బిడ్డను అప్పగిస్తే ఏకంగా ఎత్తుకెళ్లాడు

  • ఐదేళ్ల చిన్నారి అపహరణతో తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
  • నిందితుడి కోసం వేట మొదలు పెట్టిన సిబ్బంది

పరిచయం ఉన్న వ్యక్తి ఏళ్ల తరవాత కనిపిస్తే నమ్మడం వారి పొరపాటైంది. ఐదేళ్ల కుమార్తెను అప్పగించి పాలు తెచ్చేందుకు తల్లిదండ్రులు వెళ్లివచ్చేలోగా బిడ్డతోపాటు మాయమయ్యాడు. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలావున్నాయి.

హైదరబాద్ లోని యాప్రాల్‌ భాగ్యనగర్‌ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు. ఓ ఫంక్షన్‌ హాల్లో పనిచేస్తున్నాడు. ఐదేళ్ల పెద్ద కుమార్తెకు జ్వరం రావడంతో నీలోఫర్‌ ఆసుపత్రికి తీసుకువెళ్తున్నాడు. సికింద్రాబాద్‌ ఫ్యాట్నీ కూడలిలో బస్సు దిగి నాంపల్లికి వెళ్లేందుకు రైలు కోసం భార్య, పిల్లలతో కలిసి వెళ్తున్నాడు. వీరికి ఎంజీ రోడ్డు గాంధీ విగ్రహం వద్ద గతంలో పరిచయం ఉన్న రాజు కనిపించాడు. యోగక్షేమాలు కనుక్కుంటూ పాపను ఎత్తుకున్నాడు. వారితోపాటు నల్లగుట్ట మసీదు వరకు వెళ్లాడు.

అక్కడి ఓ ట్రాన్స్‌పోర్టు కంపెనీ వద్దకు వచ్చేసరికి మూడు నెలల చంటిపాప పాలు కోసం దంపతులు ఇద్దరూ వెళ్తూ ఐదేళ్ల పెద్ద కుమార్తెను రాజుకు అప్పగించారు. వారు తిరిగి వచ్చేసరికి బిడ్డతోపాటు రాజు కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు రాంగోపాల్‌పేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

More Telugu News