Bahubali: బాహుబలితో 'సాహో'ను పోల్చవద్దు... దేనికదే డిఫరెంట్: దర్శకుడు సుజిత్

  • ఆగస్టు 30న సాహో రిలీజ్
  • సాహో ఎవరినీ నిరాశ పర్చదంటున్న దర్శకుడు  
  • రాజమౌళితో పోల్చుకుంటే తాను చాలా చిన్నవాడ్నని వ్యాఖ్యలు

ఇప్పుడు దేశవ్యాప్తంగా 'సాహో' మేనియా కనిపిస్తోంది. సుదీర్ఘకాలం పాటు సాగిన షూటింగ్ ఇటీవలే పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న 'సాహో' ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ క్రమంలో ఈ చిత్ర దర్శకుడు సుజిత్ ఓ ఇంటర్వ్యూలో సాహో చిత్రం గురించి మాట్లాడాడు. చాలామంది 'సాహో' చిత్రాన్ని బాహుబలితో పోల్చుతున్నారని, అయితే ఈ రెండు చిత్రాలు దేనికవే విభిన్నమైనవని సుజిత్ స్పష్టం చేశాడు. బాహుబలి స్థాయిలో 'సాహో' ఉంటుందని భావిస్తున్నవాళ్లను తన చిత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిరాశకు గురిచేయదని పేర్కొన్నాడు. బాహుబలి చిత్రాల తర్వాత ప్రభాస్ ఫ్యాన్స్ ఏం ఆశిస్తున్నారో తాను గ్రహించగలనని వివరించాడు.

అంతేకాకుండా, మీడియాలో రాజమౌళి వంటి దర్శక దిగ్గజంతో పోలుస్తూ తనపై కథనాలు వస్తున్నాయని, వాస్తవానికి రాజమౌళి సర్ తో పోల్చుకుంటే తాను చాలా చిన్నవాడ్నని సుజిత్ వినమ్రంగా చెప్పాడు. తనకు తానుగా అలాంటి టాప్ డైరెక్టర్లతో ఎప్పుడూ పోల్చుకోనని, ఒకవేళ పోలిక తీసుకువచ్చినా అంతగొప్ప దర్శకుడితో నీకు పోలికా? అంటూ మా అమ్మ కూడా ఒప్పుకోదు అంటూ ఈ యువ దర్శకుడు తన అభిప్రాయాలను పంచుకున్నాడు.

'సాహో' వంటి భారీ బడ్జెట్, హైవోల్టేజ్ యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ముందు సుజిత్ చేసింది ఒక్క సినిమానే అంటే అతిశయోక్తి కాదు. శర్వానంద్ హీరోగా వచ్చిన 'రన్ రాజా రన్' విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో ప్రభాస్ 'సాహో' చిత్రం చేసేందుకు సుజిత్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

More Telugu News