Nara Lokesh: నిరుపేద జగన్ గారు ఎలా గెలిచారో నరసింహరాజు గారు కుండబద్దలు కొట్టేశారు: నారా లోకేశ్

  • ట్వీట్ చేసిన లోకేశ్
  • ఒక్కో అభ్యర్థికి రూ.10 కోట్ల నుంచి రూ.18 కోట్లు ఇచ్చారంటూ వ్యాఖ్య
  • రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ విషయాన్ని పరిశీలించాలంటూ విజ్ఞప్తి

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ తన విమర్శల పర్వంలో మరో ట్వీట్ చేశారు. సీఎం జగన్ ను టార్గెట్ చేస్తూ తాజాగా మరికొన్ని విమర్శనాస్త్రాలు సంధించారు. పేద రాష్ట్రానికి సీఎంగా ఎన్నికైన నిరుపేద వైఎస్ జగన్ గారు మొన్నటి ఎన్నికల్లో ఎలా గెలిచారో తెలిసిపోయిందని ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఉండి నియోజకవర్గంలో వైసీపీ తరఫున పోటీచేసిన నరసింహరాజు గారు జగన్ విజయరహస్యాన్ని కుండబద్దలు కొట్టారంటూ లోకేశ్ వివరించారు.

ఒక్కో నియోజకవర్గానికి కేవలం రూ.10 కోట్ల నుంచి రూ.18 కోట్లు ఖర్చుచేశారని నరసింహరాజు గారు బట్టబయలు చేశారంటూ తెలిపారు. ఈ విషయం ఏంటో రాష్ట్ర ఎన్నికల సంఘం గమనిస్తే బాగుంటుందని ట్వీట్ చేశారు. కాగా, ఉండి వైసీపీ అభ్యర్థి నరసింహరాజు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పార్టీ తరఫున ఒక్కో అభ్యర్థికి రూ.10 కోట్ల నుంచి రూ.18 కోట్ల వరకు అందాయని, అయితే తాను ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని, తన సొంత డబ్బునే ఖర్చు చేశానని చెబుతున్నట్టుగా ఉన్న వీడియో వైరల్ అవుతోంది.

More Telugu News