Andhra Pradesh: గుంటూరు జిల్లాలో పల్టీ కొట్టిన ఆర్టీసీ బస్సు.. పలువురికి గాయాలు!

  • గుంటూరులోని రావులపురంలో ఘటన
  • వినుకొండ నుంచి మాచర్ల వెళుతున్న బస్సు
  • పక్కకు దిగడంతో అదుపు తప్పి పల్టీ

గుంటూరు జిల్లాలో ఈరోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న ఆటోను తప్పింపబోయి బోల్తా కొట్టింది. ‘ఏపీ 032 0016’ అనే నంబర్ ఉన్న ఆర్టీసీ బస్సు ఈరోజు వినుకొండ నుంచి మాచర్లకు బయలుదేరింది. అయితే రావులపురం వద్దకు రాగానే ఎదురుగా ఆటో వస్తుండటంతో బస్సు కొంచెం పక్కకు దిగింది.

అయితే పక్కనున్న గ్రావెల్ మార్గం మెత్తగా ఉండటంతో ఓ వైపునకు ఒరిగిపోయి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి స్వల్పగాయాలు అయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని బాధితులను సమీప ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స పొందిన అనంతరం వీరిని విడుదల చేశారు. 

More Telugu News