big boss: బిగ్‌బాస్-3: కంటెస్టెంట్లపై నాగార్జున సీరియస్

  • రంజుగా సాగుతున్న షో
  • రాహుల్‌తో శ్రీముఖికి క్షమాపణలు చెప్పించిన నాగార్జున
  • అలీతో 21 గుంజీలు తీయించిన నాగ్

స్టార్ మా టీవీలో ప్రసారం అవుతున్న బిగ్‌బాస్-3 రియాలిటీ షో రసవత్తరంగా సాగుతోంది. మొదట్లో చప్పగా సాగుతున్నట్టు అనిపించిన షో తర్వాత ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొంటోంది. టాస్క్‌ల జోరు పెరగడంతో హౌ‌స్‌లోని పోటీదారుల మధ్య గొడవలు, విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇవి కాస్తా హద్దు మీరుతుండడంతో వ్యాఖ్యాత నాగార్జున శనివారం కంటెస్టెంట్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.  

ఓ టాస్క్‌లో భాగంగా అలీ-హిమజ మధ్య జరిగిన గొడవను ప్రస్తావిస్తూ అలీకి నాగార్జున చీవాట్లు పెట్టాడు. హిమజ విషయంలో అలీ ప్రవర్తించిన తీరు సరికాదంటూ హిమజకు మద్దతు పలికాడు. అలాగే, వారిద్దరి మధ్య గొడవ జరుగుతున్నా సర్ది చెప్పేందుకు ఎవరూ రాకపోవడంపై హౌస్‌లోని మిగతా సభ్యులపైనా మండిపడ్డాడు. హిమజ విషయంలో జోక్యం చేసుకుని అలీకి అడ్డుపడిన తమన్నాను నాగార్జున ప్రశంసించాడు. తప్పు చేసిన అలీ చేత 21 గుంజీలు తీయించాడు.

అద్దం పగలగొట్టిన రవికృష్ణకి చేయి తెగినప్పుడు శ్రీముఖిపై నోరు జారిన రాహుల్‌పైనా నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు. శ్రీముఖిని ఉద్దేశించి ‘ఫాల్తు ఐడియాలు.. ఫాల్తు మొహంది’ అన్న వ్యాఖ్యలను నాగార్జున గుర్తు చేస్తూ సీరియస్ అయ్యాడు. ఇదే ఆఖరి వార్నింగ్ ఇలాంటి ఫాల్తు మాటలు మరోమారు వద్దు అంటూ వార్నింగ్‌ ఇచ్చాడు. రాహుల్‌తో శ్రీముఖికి సారీ చెప్పించారు.

More Telugu News