Andhra Pradesh: విజయవాడలో పోలీస్ జులుం.. జూనియర్ డాక్టర్ పై దాడిచేసిన డీసీపీ!

  • నేషనల్ మెడికల్ కమిషన్ బిల్లు తెచ్చిన కేంద్రం
  • దానికి వ్యతిరేకంగా జూనియర్ డాక్టర్ల ఆందోళన
  • జూడాలతో డీసీపీ హర్షవర్థన్ వాగ్వాదం, దాడి

అఖిల భారత వైద్య మండలి(ఎంసీఐ) స్థానంలో నేషనల్ మెడికల్ కమిషన్ ను ఏర్పాటు చేస్తూ పార్లమెంటు ఓ బిల్లును ఇటీవల ఆమోదించింది. దీంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పలుచోట్ల వైద్యులు ఆందోళనకు దిగారు. ఇందులో భాగంగా విజయవాడలోని ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం వద్ద జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడ ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన డీసీపీ హర్షవర్థన్ ఆందోళనకారులను చూడగానే సహనం కోల్పోయారు. జూనియర్ డాక్టర్ల దగ్గరకు వెళ్లి ఆందోళనను విరమించాలని ఆదేశించారు. కానీ అందుకు ఒప్పుకోని జూనియర్ డాక్టర్లు వాగ్వాదానికి దిగారు. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన హర్షవర్థన్  ఓ జూనియర్ డాక్టర్ కాలర్ పట్టుకుని ఈ చెంప, ఆ చెంప వాయించేశారు.

డీసీపీ దాడిపై ఆగ్రహానికి లోనైన జూనియర్ డాక్టర్ ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు ఫిర్యాదు చేశారు. కాగా, పోలీస్ ఉన్నతాధికారులు ఈ విషయమై ఇంతవరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాగా, ఈ వ్యవహారంపై డీసీపీ హర్షవర్థన్ నుంచి ఇంతవరకూ ఎలాంటి వివరణ రాలేదు.

More Telugu News